
హైదరాబాద్, వెలుగు: గుండెపోటుతో కోర్టు ఆవరణలోనే హైకోర్టు న్యాయవాది పర్సా అనంత నాగేశ్వర్రావు (47) మరణించారు. గురువారం మధ్యాహ్నం కోర్టు హాలులోని కారిడార్లో ఉన్న కుర్చీలో కూర్చొని ఉండగా, అలాగే కుప్పకూలిపోయారు. పక్కనున్న వారు గమనించి వెంటనే సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్కు ఫోన్ చేసి, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు వెల్లడించారు. న్యాయవాది మరణానికి కార్డియక్ అరెస్ట్ కారణం కావొచ్చని తెలిపారు.
ఉమ్మడి ఏపీ హైకోర్టులో అడ్వకేట్ క్లర్క్గా జీవితాన్ని ప్రారంభించిన నాగేశ్వర్ రావు.. తర్వాత లా పూర్తి చేసి అదే కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. తర్వాత సీనియర్ న్యాయవాది వై.రామరావు వద్ద జూనియర్గా చేశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, జీపీగా, స్పెషల్ జీపీగా వర్క్ చేశారు. రెవెన్యూ వంటి శాఖకు ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. ఆయన మృతదేహాన్ని షేక్పేట్లోని నివాసానికి తరలించారు. నాగేశ్వర్రావుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతదేహాం వద్ద హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తీక్, పలువురు సీనియర్ న్యాయవాదులు, అడ్వకేట్ క్లర్క్స్ నివాళి అర్పించారు.